13. పదమూడవ అధ్యాయము
(శీమద్భగవద్గీతా పర్వము)
భీష్ముని పాటును సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పుట.
వైశంపాయన ఉవాచ
అథ గావల్గణిర్విద్వాన్ సంయుగాదేత్య భారత ।
ప్రత్యక్షదర్శీ సర్వస్య భూతభవ్యభవిష్యవిత్ ॥ 1
ధ్యాయతే ధృతరాష్ట్రాయ సహసోత్పత్య దుఃఖితః ।
ఆచష్ట నిహతం భీష్మం భరతానాం పితామహమ్ ॥ 2
వైశంపాయనుడు చెపుతున్నాడు. భారతా! తరువాత ఒకనాడు విద్వాంసుడయిన సంజయుడు యుద్ధభూమి నుండి తొందరగా వచ్చాడు. అతడు యుద్ధమంతా ప్రత్యక్షంగా చూస్తున్నవాడు. భూతభవిష్యద్వర్తమానాలు తెలిసినవాడు. అతడు దుఃఖిస్తూ వచ్చి, చింతామగ్నుడయిన ధృతరాష్ట్రునికి భీష్మపితామహుడు పడిపోయినట్లు చెప్పాడు. (1,2)
సంజయ ఉవాచ
సంజయోఽహం మహారాజ నమస్తే భరతర్షభ ।
హతో భీష్మః శాంతనవః భరతానాం పితామహః ॥ 3
సంజయుడు చెపుతున్నాడు.
"మహారాజా! నేను సంజయుణ్ణి. నమస్కరిస్తున్నాను. భరత పుత్రుల పితామహుడయిన భీష్ముడు పడిపోయాడు. (3)
కకుదం సర్వయోధానాం ధామ సర్వధనుష్మతామ్ ।
శరతల్పగతః సోఽద్య శేతే కురుపితామహః ॥ 4
యోధులందరిలో ధ్వజంగ్లా ఉండేవాడు. ధనుర్ధారులకు ఆదర్శ మయిన కురుపితామహుడిపుడు అంపశయ్యపై పడి ఉన్నాడు. (4)
యస్య వీర్యం సమాశ్రిత్య ద్యూతం పుత్రస్తవాకరోత్ ।
స శేతే నిహతో రాజన్ సంఖ్యే భీష్మః శిఖండినా ॥ 5
రాజా! నీ కొడుకు ఆయన పరాక్రమం చూసుకొనే జూదమాడాడు. అటువంటి భీష్ముడు ఇపుడు శిఖండి చేత యుద్ధంలో దెబ్బతిని, పడిపోయాడు. (5)
యః సర్వాన్ పృథివీపాలన్ సమవేతాన్ మహామృధే ।
జిగాయైకరథేనైవ కాశిపుర్యాం మహారథః ॥ 6
జామదగ్న్యం రణే రామం యోఽయుధ్యదపసంభ్రమః ।
న హతో జామదగ్న్యేన స హతోఽద్య శిఖండినా ॥ 7
మహారథుడైన ఆయన కాశీ పట్టణంలో (స్వయం వరానికి వచ్చిన) రాజులందరినీ ఒక్కడే రథంపై నిలిచి మహాయుద్ధంలో ఓడించాడు. పరశురామునితో తడబడకుండా యుద్ధం చేసినవాడు. పరశురామునిచేత దెబ్బతినలేదు కాని ఇపుడు శిఖండిచేత దెబ్బతిన్నాడు. (6,7)
మహేంద్రసదృశః శౌర్యే స్థైర్యే చ హిమవానివ ।
సముద్ర ఇవ గాంభీర్యే సహిష్ణుత్వే ధరాసమః ॥ 8
పరాక్రమంలో ఇంద్రసమానుడు. స్థిరత్వంలో హిమవంతుడు. గాంభీర్యంలో సముద్రుడు. సహనంలో భూమితో సమానుడు. (8)
శరదంష్ట్రో ధనుర్వక్త్రః ఖడ్గజిహ్వో దురాసదః ।
నరసింహః పితా తేఽద్య పాంచాల్యేన నిపాతితః ॥ 9
అతనికి బాణాలే కోరలు. ధనుస్సే తెరిచిన నోరు. కత్తియే నాలుక. అతనిని ఎవరూ దరి చేరలేరు. నరులలో సింహం వంటివాడు నీ తండ్రి భీష్ముడు. ఇపుడు శిఖండిచేత పడిపోయాడు. (9)
పాండవానాం మహాసైన్యం యం దృష్ట్వోద్యతమాహవే ।
ప్రావేపత భయోద్విగ్నం సింహం దృష్ట్వేవ గోగణః ॥ 10
పరిరక్ష్య స సేనాం తే దశరాత్రమనీకహా ।
జగామాస్తమివాదిత్యః కృత్వా కర్మ సుదుష్కరమ్ ॥ 11
యుద్ధానికి సంసిద్ధుడయిన భీష్ముని చూసి పాండవసైన్యం సింహాన్ని చూసిన ఆవుల మంద లాగా భయంతో వణికిపోయింది. భీష్ముడు దుష్కరమైన పరాక్రమం చూపి, నీ సేనను పదిరోజులు రక్షించి, సూర్యుని వలె అస్తమిస్తున్నాడు. (10,11)
యః స శక్ర ఇవాక్షోభ్యః వర్షన్ బాణాన్ సహస్రశః ।
జఘాన యుధి యోధానామ్ అర్బుదం దశభిర్దినైః ॥ 12
స శేతే నిహతో భూమౌ వాతభగ్న ఇవ ద్రుమః ।
తవ దుర్మంత్రితే రాజన్ యథా నార్హః స భారత ॥ 13
ఇంద్రుడు వర్షం కురిపించినట్లు వేలకొద్ధీ బాణాలను విడుస్తూ, యుద్ధంలో పది రోజుల్లో పదికోట్ల మందిని చంపి, చివరకు గాలికి విరిగిపోయిన చెట్టులా నేల మీద పడ్డాడు. ఇదంతా నీ దురాచలోచన వల్లనే. రాజా! కాని భీష్ముడికి ఈ దుర్దశ తగనిది." (12,13)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి భీష్మమృత్యుశ్రవణే త్రయోదశోఽధ్యాయః ॥ 13 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున భీష్ముడు పడిపోయిన వార్త అను పదమూడవ అధ్యాయము. (13)